ఇసుక బల్క్ ఆర్డర్లు ఇవ్వొద్దు..: సీఎం జగన్

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం

ఇసుక పోర్టల్ లో బల్క్ ఆర్డర్లను తొలగించాలని, డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం  ఇసుకపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా రీచ్ లన్నీ మూతబడ్డాయని, ఇప్పుడిప్పుడే మళ్లీ రీచ్ లు ప్రారంభమవుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. వారం, పది రోజుల్లో రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ బల్క్‌ ఆర్డర్లకు అనుమతులను జేసీకి అప్పగించాలన్నారు. పోర్టల్‌ ఆన్‌ చేయగానే.. వెంటనే నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్‌ బుకింగ్‌ ఉంటే… సూపరింటెండెంట్‌ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వాలన్నారు. 

గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలని, నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలని చెప్పారు. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలన్నారు. బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ  ఉంచాలన్నారు. చిన్న చిన్న నదుల నుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం సూచించారు. కాకపోతే పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తామని అధికారులు తెలిపారు. ఎడ్ల బళ్ల ద్వారా తీసుకెళ్లి.. వేరేచోట నిల్వచేసి.. అక్రమంగా తరలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. 

 

Leave a Comment