పేదలందరికీ జులై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఇళ్ల పట్టల పంపిణీ పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు మనం ఇవ్వబోతున్నామన్నారు.
ఎవరు మిగిలిపోయినా వారికీ మళ్లీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఆదేశించారు. ఆ జాబితాలో అర్హతల వివరాలు కూడా పెట్టాలని, జాబితాలో పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో కూడా వివరాలు పెట్టాలని సూచించారు.
మే 6 నుంచి 21 వరకూ జాబితాల ప్రదర్శన ఉంటుందన్నారు. అ తర్వాత మరో 15 రోజులు వెరిఫికేషన్ మరియు తుది జాబితా ఖరారు చేస్తామని తెలిపారు. జూన్ 7లోగా తుది జాబితాను ప్రదర్శించాలన్నారు. ఎవరు కూడా తమకు అన్యాయం జరిగిందనే మాట అనకూడదన్నారు. అర్హత ఉండి కూడా ఇవ్వలేదనే మాట రాకూడదని స్పష్టం చేశారు.
ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి ఇంకా లబ్దిదారులు మిగిలిపోయారని విజ్ఞప్తులు వచ్చాయన్నారు. తమకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, వాళ్లకీ ఇంటి స్థలం పట్టాలు ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు.