కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి..!

డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దానిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొత్తగా కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఈ నిర్ధారణకు వచ్చారు. 

కరోనా వైరస్‌ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం నుంచి బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్‌ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడం అన్నీ చేతులతోనే చేస్తుంటారు. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్‌ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. 

దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. రెడ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో కరెన్సీని వీలైనంత వరకు తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. 

 

Leave a Comment