పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఇటీవల ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్ లో ఉన్నారు. 

అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. దీంతో రెండు రోజుల కింద మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమాన్ హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్మ చేరడంతో యాంటి వైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు. 

చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం వచ్చి పవన్ కళ్యాణ్ ని పరీక్షించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

Leave a Comment