సీజనల్ వ్యాధిలా కరోనా వైరస్..!

కరోనా విషయంలో స్పెయిన్ లోని బార్సిలోనా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ కు చెందిన శాస్త్రవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడు కరోనా వైరస్ సీజనల్ వ్యాధిగా మారి ఉండొచ్చని పేర్కొన్నారు. కరోనా చాలా వరకు సీజనల్ ఇన్ ఫ్లుయెంజాలా రూపాంతరం చెంది ఉండవచ్చని వెల్లడించారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందన్న వాదనను ఇది సమర్థిస్తోంది. 

ఈనేపథ్యంలో పరిసరాల్లోని గాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. పరిశోధకులు మొదట నిర్వహించిన సైద్ధాంతిక నమూనా అధ్యయనంలో కరోనా వ్యాప్తిలో వాతావరణం ఒక కారకం కాదని వెల్లడి అయింది. అయితే చైనాలో మొదట ఉత్పన్నమైన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. అది 30,50 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నట్లు గుర్తించారు. 

అక్కడ గాలిలో తేమ చాలా తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఉష్ణోగ్రత కూడా 5 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నట్లు గుర్తించారు. ఈనేపథ్యంలో 162 దేశాల్లో కరోనా వ్యాప్తి మొదటి దశలో ఉనప్పుడు ఉష్ణోగ్రత, తేమ చూపిన ప్రభావాన్ని పరిశీలించారు. ఉష్ణోగ్రత, తేమ తక్కువగా ఉన్నప్పుడు వ్యాధి వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందని తేల్చారు. ఈ రెండు పరామితులు పెరిగినప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. వేసవిలో మాత్రం ఈ పోకడ విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు. ఆ కాలంలో యువత ఎక్కువగా గుమిగూడడం, పర్యాటకులు పెరగడం, ఏసీల వినియోగం వంటి ఇందుకు దోహద పడి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.   

 

Leave a Comment