క్వారంటైన్ కేంద్రాలపై నిరంతర పరిశీలన ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సీఎం తెలిపారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్ నంబర్ తమ వద్ద ఉందని, కమాండ్ కంట్రోల్ నుంచి ర్యాండమ్గా కాల్చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు తెలిపారు.
లాక్ డౌన్ సడలింపుపై చర్చ..
లాక్డౌన్ సడలింపులు నేపథ్యంలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయని సమావేశంలో చర్చించారు. వీరిలో ఎవరిని క్వారంటైన్లో పెట్టాలి.. ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నదానిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్ విధిస్తామని అధికారులు తెలిపారు.
లక్ష దాటిన కోవిడ్-19 పరీక్షలు..
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,00,997 కోవిడ్ –19 పరీక్షలు చేశారు. ప్రతి మిలియన్ కు 1919 చొప్పున పరీక్షలతో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రతి మిలియన్కు 2 వేలకు చేరువలో పరీక్షలు ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు ఉన్నాయి. వాటి 79 వెరీ యాక్టివ్ క్లస్టర్లు, 68 యాక్టివ్ క్లస్టర్లు, 53 డార్మంట్ క్లస్టర్లు ఉన్నాయని, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని అధికారులు వెల్లడించారు.
కోవిడ్ –19 మరణాలు తగ్గించేందుకు వ్యూహం..
కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు. మిగిలిన వారికి రెండు మూడు రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తామని అధికారుల వెల్లడించారు. వీరిలో 4వేల మంది హైరిస్క్ ఉన్న వారిగా గుర్తించామన్నారు. కోవిడ్ కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు తెలియజేశారు.