సీఎంల పనితీరుపై తాజా సర్వే.. జగన్ కి పడిపోయిన పాపులారిటీ.. మరీ కేసీఆర్ కి..!

కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఒపినియన్‌ సర్వే (సీఎన్‌ఓఎస్‌) భారీ సర్వే నిర్వహించింది. ప్రభుత్వ విధానాలు, పాలకుల పనితీరుపై జనాల అభిప్రాయం సేకరించింది. ప్రధాని మోడీతో పాటు దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఈ సర్వే జరిగింది. సీఎన్‌ఓఎస్‌ సర్వే ఫలితాల్లో సంచలన ఫలితాలు వచ్చాయి. 

మోడీకి పెరిగిన ప్రజాదరణ:

సీఎన్‌వోఎస్‌ తాజా సర్వే ఫలితాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి  ప్రజాదరణ గతంలో కంటే కాస్త పెరిగింది. మోడీ  నికర ఆమోదం రేటింగ్‌ 36 పాయింట్లుగా ఉంది. 54 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ  నాయకత్వాన్ని ఆమోదించారు. 18 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగితా వారు తటస్థంగా ఉన్నారు.

నవీన్ ఫస్ట్:

ముఖ్యమంత్రుల పనితీరులో దేశంలో అత్యంత ప్రజా మద్దతు కల్గిన ముఖ్యమంత్రిగా ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నిలిచారు. 70 శాతం ఒడిసా ప్రజలు నవీన్ లీడర్ ఫిప్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. 19 శాతం మందే అసంతృప్తిగా ఉండగా.. 11 శాతం మంది ఏమి చెప్పలేమన్నారు. నవీన్ పట్నాయక్ తర్వాత స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ నిలిచారు. ఆయన తర్వాత ఇటీవలే రాజీనామా చేసిన మహారాష్ట్ర తాజా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఉన్నారు. సీఎన్‌ఓఎస్‌ సర్వేలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు నాలుగు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ ఐదో స్థానం దక్కింది.

కేసీఆర్ కి 11వ స్థానం:

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుపై ప్రజా వ్యతిరేకత భారీగా ఉందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే CNOS Surveyలో మాత్రం కేసీఆర్ ప్రజాదరణ ప్రచారం జరుగుతున్న స్థాయిలో తగ్గలేదని తేలింది. 25 ముఖ్యమంత్రుల పనితీరుపై జరిగిన తాజా సర్వేలో  తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. కేసీఆర్ నాయకత్వంపై 49 శాతం మంది తెలంగాణ ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. 19 శాతం మంది కేసీఆర్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 శాతం మంది తటస్థంగా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంపై అప్రూవల్ రేటింగ్ తగ్గలేదని సర్వేలో వెల్లడైంది.

పడిపోయిన జగన్ ర్యాంక్:

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎన్ఓఎస్ సర్వేలో దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయి. 25 మంది సీఎంలపై సర్వే చేస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చివరి నుంచి ఆరవ స్థానం దక్కింది. ఆయన 20వ స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వైసీపీకి 151 సీట్లు దక్కాయి. అయితే మూడేళ్లలోనే జగన్ పాపులారిటి తగ్గిపోయింది. తాజా సర్వేలో సీఎం జగన్ పై పనితీరుపై 39 శాతం మంది ఆంధ్రా ప్రజలు మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ పాలనపై 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 32 శాతం మంది తటస్థంగా ఉండిపోయారు.   

CNOS Survey తాజా సర్వేలో సీఎం జగన్ తర్వాత చివరి స్థానాల్లో హర్యానా ముఖ్యమంత్రి  మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మయ్‌, నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫూ రియో గోవా ముఖ్యమంత్రి ప్రమాద్‌ సావంత్‌ నిలిచారు. అట్టడుగు స్థానంలో త్రిపుర సీఎం మాణిక్‌ సాహా ఉన్నారు.

 

Leave a Comment