రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వైఎస్సార్ జనతా బజార్ల ప్రతిపాదలపై అధికారులతో సీఎం జగన్ సమావేంలో చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్చైన్, ప్రాసెసింగ్ నెట్వర్క్ను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రతిపాదనలను సమావేశంలో సీఎం చర్చించారు.
రాష్ట్రంలో 11వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిలో వైయస్సార్ జనతా బజార్లు పెట్టేదిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు రావాలన్నారు. దాదాపుగా 22వేల జనతాబజార్లతో పెద్ద నెట్వర్క్ ఏర్పడుతుందన్నారు. ఈ బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలన్నారు. పాలు, పళ్లు, కూరగాయలు తదితర వాటిని నిల్వ చేసి విక్రయానికి అందుబాటులో పెట్టాలని, వీటి వద్ద చిన్నసైజు ట్రక్కులు లేదా పికప్ వ్యాన్స్ కూడా పెట్టాలని సూచించారు.
ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కు
ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కు ఉండాలని, ప్రతిరోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. మరోవైపు రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు అమ్ముకునే సరుకులను గోదాములకు లేదా దగ్గర్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తరలించేందుకూ ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు.
మ్యాపింగ్ చేయాలి…
జనతా బజార్లకు సంబంధించి మ్యాపింగ్ చేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రైతుజార్లను, మార్కెట్లను వికేంద్రీకరించారని, ప్రతి నిత్యావసర వస్తువును దాదాపుగా ప్రతిగడప వద్దకూ చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పెద్ద ఎత్తున మార్కెట్ అవకాశాలు కరోనా ఎదుర్కోవడం రూపంలో మనకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ లొకేషన్లను కూడా గుర్తించి ఆ మేరకు అక్కడ కూడా జనతా బజార్లు వచ్చేలా చేయాలన్నారు.
రైతులకు ఇబ్బందులు రావు..
జనతా బజార్లతో రైతులకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు రాకుండా తొలగిపోతాయన్నారు. లాభ, నష్టాలు లేని రీతిలో నిర్వహిస్తే.. ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయన్నారు. ఇదే జనతా బజార్లలో చేపలు, రొయ్యల్లాంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడుపోతాయన్నారు. ప్రతి నియోజకవర్గానికీ కోల్డ్స్టోరేజీలను ఏర్పాటు చేసేదిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాలన్నారు.