రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనదని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకే రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని వెల్లడించారు. మంగళవారం ‘వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ మూడో విడత చెల్లింపు, నివర్ తుపాన్ నష్టంపై ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ అందజేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో దాదాపు రూ.1766 కోట్లు జమ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఖాతాల్లోకి మరో రూ.1766 కోట్లు జమ చేస్తున్నామన్నారు. అందులో మూడో విడత రైతు భరోసా కింద అర కోటికి పైగా రైతుల ఖాతాల్లో రూ.1120 కోట్లు, నివర్ తుపానుతో నష్టపోయిన 8.34 లక్షల రైతులకు (ఒక సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో) నెల రోజుల లోపే పరిహారం అందిస్తూ, దాదాపు రూ.646 కోట్లు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.