నమ్మి వస్తే చంపేసిన ప్రియుడు.. షర్టుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా..!

నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేశాడు ప్రియుడు. ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు.. కానీ విజిటింగ్ కార్డు, షర్టుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రం, గోపాల్ గంజి జిల్లా, మధు సారియా గ్రామానికి చెందిన రాజ్ దూత్, కవితకుమారి(20) ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో కవిత గర్భం దాల్చింది..

అప్పటి నుంచి తనను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది కవిత.. రాజ్ దూత్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో రాజ్ దూత్, కవితను తీసుకుని చిత్తూరుకు వచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్ 11న చిత్తూరులోని ఓ సెల్ పాయింట్ లో ఫోన్ రిపేరు చేయించారు. తర్వాత పెనమూరు మండలంలోని కలవగుంట పంచాయతీ విజయనగరం యానాది కాలనీలోని ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

అబార్షన్ చేయించుకోవాలని కవితపై ఒత్తిడి తెచ్చాడు రాజ్ దూత్.. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో కవితను హత్య చేయాలని అనుకున్నాడు. ఓ రోజు ఆమె నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండుతో గట్టిగా అదిమి, ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె దుస్తులతో సహా ఎలాంటి ఆధారాలు లేకుండా రాజ్ దూత్ పారిపోయాడు. 

ఇక రెండు రోజుల అనంతరం ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో స్థానికులు అనుమానింతో అక్టోబర్ 19న పోలీసులకు సమచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇంటిలో పరిశీలించారు. అక్కడ వారికి మొబైల్ షాప్ విజిటింగ్ కార్డు, ఓ షర్టుపై ఉన్న స్టిక్కర్ దొరికాయి. అవే పోలీసులకు ఆధారలయ్యాయి. మొబైల్ షాపులో సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. 

Leave a Comment