దాడి సమయంలో కారులోనే ఎమ్మెల్యే భర్త, మరిది
పది మంది ఎమ్మెల్యే బంధువులకు తీవ్రగాయాలు
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బండరాళ్లు, కత్తులు, రాడ్లతో రెచ్చిపోయారు. ఈ ఘటన గురువారం రాత్రి కట్టుబడివారిపాలెం సమీపంలో జరిగింది. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఎమ్మెల్యే స్వగ్రామం పురుషోత్తమ పట్టణంలో వైసీపీ కార్యకర్తలు ఐదు భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రభలన్నింటిని గురువారం రాత్రికి కోటప్పకొండకు చేర్చారు. ప్రభలు సురక్షితంగా కొండకు చేరే వరకు ఎమ్మెల్యే భర్త కుమారస్వామి, మరిది విడదల గోపి తదిరతులు దగ్గరుండి పర్యవేక్షించారు. రాత్రి 12 గంటల సమయంలో వారు వెనుదిరిగి వస్తుండగా.. కట్టుబడివారిపాలెం గ్రామం దాటగానే వీరు ప్రయాణిస్తున్న వాహనంపైకి దుండగులు ఒక్కసారిగా బండరాళ్లు విసరడం ప్రారంభించారు. కత్తులు, రాడ్లుతో దాడికి తెగబడ్డారు.ఎమ్మెల్యేను దుర్భాషలాడారు. కమ్మ వారికే సొంతమైన చిలకలూరిపేట నియోజకవర్గంలో బీసీ మహిళ ఎలా గెలుస్తుందంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎమ్మల్యే బంధువులు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానికి ఆసుపత్రికి తరలించారు.
పక్కా ప్రణాళికతోనే..
పక్కా ప్రణాళికతోనే దుండగులు దాడికి తెగబడ్డారు. కమ్మవారిపాలెం, మద్దిరాల, యడవల్లి గ్రామాలకు చెందిన గూండాలు ఎమ్మెల్యే కారు ఆ దారిలో వెళుతుండటాన్ని గమనించారు.కట్టుబడివారి పాలెం గ్రామానికి విడదల గోపి కారు రాగానే.. ఒక్కసారిగా కారును అడ్డుకున్నారు. ఆ వెంటనే రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎమ్మెల్యే భర్త కుమారస్వామి, మరిది గోపిని ఆ వైపు వెళ్తున్న వారు ద్విచక్రవాహనాలపై ఎక్కించుకుని తీసుకెళ్లడంతో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.