ముస్లింలపై వివక్ష చేపేలా వాట్సాప్ లో పోస్టు చేసిన చెన్నైలోని ఒక బేకరీ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో ఉన్న పార్థసారథిపురం వద్ద జైన్ బేకరీస్ మరియు మిఠాయిల దుకాణం ఉంది. ఆన్ లైన్ లో వ్యాపారం చేసే ఈ దుకాణం బేకర్ ‘మేడ్ బై జైన్స్ ఆన్ ఆర్డర్. నో ముస్లిం స్టాఫ్’ అంటూ వాట్సాప్ లో ఒక పోస్టు చేశాడు.
ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ పోస్టుపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ పోస్టుపై పోలీసులు ఆ బేకరి యజమానిపై చర్యలు తీసుకున్నారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం మరియు శాంతిని ఉల్లంఘించడం వంటి చర్యలు చేపట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
దేశంలో ముస్లింలు వేధింపులకు గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ గత నెలలో 100 మందికిపై మాజీ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ కూడా రాశారు. తబ్లిఘీ జమాత్ చర్య వల్ల దేశంలోని కొన్ని మీడియా వర్గాలు మొత్తం ముస్లిం సమాజంపై ద్వేషం పెరిగేలా చూపించాయని వారు ఆరోపించారు.