ఈ చెంబుకు అతీత శక్తులు ఉన్నాయట..రైస్ పుల్లింగ్ పేరుతో మోసం..!

మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసే వారు పుడుతునే ఉంటారు.. తాజాగా ఓ చెంబుకు అతీత శక్తులు ఉన్నాయంటూ నమ్మించి ప్రజలను మోసం చేసి లక్షల నగదు కాజేస్తున్నారు.. ఇలా మోసం చేస్తున్న ఓ గ్యాంగ్ ని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాల మేరకు చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన బండారి హేమంత్ కుమార్ అతని స్నేహితులు కలిసి ఈ చెంబుకు అతీత శక్తులు ఉన్నాయంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఎరవేశారు. ఈ చెంబు మీ దగ్గర ఉంటే కోటీశ్వరులు అవుతారని నమ్మించారు. జాతీయ మార్కెట్ లో ఈ చెంబు కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పారు. 

దీంతో గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.1.6 లక్షలు ఇచ్చి ఆ చెంబును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ చెంబుకు ఎలాంటి శక్తులు లేవని తెలుసుకుని అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

ఎలా మోసం చేశారంటే..

నలుగు మోసగాళ్లు యూట్యూబ్ లో చూసి ఓ చెంబుకు కొన్ని రసాయనాలు అద్ది పురాతన వస్తువుగా మార్చారు. అలా చేసి ఆ చెంబు బియ్యాన్ని ఆకర్షించేలా తయారు చేశారు. దానికి అతీత శక్తులు ఉన్నాయని గుంటూరుకు చెందిన ఇద్దరు బాధితులను మోసం చేసినట్లు విచారణలో వెల్లడించారు. రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తూ నగదు కాజేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, చెంబు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి తూర్ప డీఎస్సీ వెల్లడించారు.   

Leave a Comment