మహిళలకు అండగా టీడీపీ : చంద్రబాబు

అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోతవ్సం సందర్భంగా మహిళలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు అండగా టీడీపీ ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా మహిళకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. రాజధాని అమరావతి కోసం మహిళలు దీక్షలు చేయడంపై స్పందించారు. రాజధాని అమరావతి కోసం 82 రోజులుగా మహిళలు దీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలతో ప్రభుత్వం వారికి జవాబిస్తోందని విమర్శించారు. మరోవైపు రేషన్, పెన్షన్లు పోయి అనేక మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 9 నెలల్లోనే 180 మంది ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయని పేర్కొన్నారు. బాధితుల్లో బడుగువర్గాల వారు ఎక్కువగా ఉంటే.. నిందితుల్లో వైసీపీ వాళ్లే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం దిశ చట్టం తెస్తే సంతోషించాం.. కానీ సమాజాన్ని ఏ దిశకు తీసుకుపోతున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళల సహనాన్ని అలుసుగా తీసుకుంటే గుణపాఠం నేర్చుకోక తప్పదని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

Leave a Comment