ర్యాపిట్ టెస్టు కిట్లు రావడంతో పరీక్షలు పెరుగుతాయని, రోజుకు చేసే టెస్టుల సంఖ్య 10 వేల నుంచి 15 వేలకు పెరుగుతుందని వైద్యలు తెలిపారు. కోవిడ్ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కుటుంబ సర్వేలో గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.
పేషెంట్ కేర్ మేనేజ్మెంట్లో భాగంగా గతంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామన్న వైద్యశాఖ అధికారులు తెలిపారు. 40 సంవత్సరాల పైబడి… ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పాటిస్తున్నామని వెల్లడించారు.
కరోనా లక్షణాలు ఉంటే.. నేరుగా కోవిడ్ ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. క్రిటికల్ కేర్ మేనేజ్ మెంట్ కోసం కొంత మంది డాక్టర్లతో కూడా ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని, ఏ సమయంలో నైనా ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని అధికారులు సీఎంకు చెప్పారు. రోగి చికిత్స పొందుతున్న సంబంధిత ఆస్పత్రి వైద్యులకు నిరంతరం గైడెన్స్ ఇస్తారని, పేషెంట్ పారామీటర్స్పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని అధికారులు వెల్లడించారు.
జిల్లాల్లో గుర్తించిన కోవిడ్ ఆస్పత్రులు కాకుండా మిగతా ఆస్పత్రుల్లో రెగ్యులర్ సర్వీసులకు, ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బందులకు లేకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు. ఆరోగ్యశ్రీలో నమోదైన రోగులకు నేరుగా కాల్ చేసి.. వారికి ఏ ఆస్పత్రిలో సేవలు లభిస్తాన్నయన్న దానిపై సమాచారాన్ని తెలియజేస్తున్నామని వెల్లడించారు. క్వారంటైన్లలో సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు.