చౌకబారు రాజకీయాలు మానుకోండి..

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

పాలన ఎలా చేయాలో వైసీపీ నేతలు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. చంద్రబాబుపై విమర్శలు చేసినంత మాత్రానా ఆయన స్థాయి తగ్గదని, వైసీపీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని తెలిపారు. చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. 

చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటే వైసీపీకి వచ్చిన నష్టమేంటని, గతంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ప్రజల గురించి వారి బాగోగుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఉందన్నారు. 

మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవులకు గడ్డి పెడుతుంటే అవి తీసుకోలేదని విమర్శించారు.  మంత్రులు ఒక రోజు అక్కడ బస చేస్తే ప్రమాదం సమసిపోయినట్టు కాదన్నారు. అక్కడి నీరు, పాలు వాడొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. ధైర్యముంటే ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.నిపుణులతో కమిటీ ఎందుకు వేయలేదని  ప్రశ్నించారు.  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు.  

విశాఖలో వైసీపీ నేతల నాటకాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తున్నారో ఓసారి ఆలోచించాలన్నారు. మీరిచ్చిన డబ్బులు తమకొద్దని, తమ భవిష్యత్ ఏంటని వారు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. విపక్షం సలహా నచ్చితే తీసుకోండి లేకపోతే వదిలేయండని అన్నారు. ఎల్జీ ప్రతినిధులను వదిలేసి బాధితులపై కేసు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. 

Leave a Comment