వృద్ధాప్యంలో ఎవరూ కూడా తమ కనీస జీవనావసరాల నిమిత్తం ఇతరులపై ఆధారపడకుండా నెలనెలా పింఛను రూపంలో కొంత మొత్తాన్ని పొంది గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం అటల్ పెన్షన్ యోజన.
ఈ పథకం జూన్ 1, 2015న ప్రారంభమైంది. ఈ పథకం కింద పాలసీ తీసుకున్నట్లయితే 60 సంవత్సరాల నుంచి నెలనెలా రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛన్ పొందవచ్చు.
పెన్షన్ యోజనకు అర్హత..
- బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరవచ్చు.
- 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు.
- గత ఎన్.పీ.ఎస్ లైట్ పథకంలోని పాలసీదారులు కూడా ఈ పథకంలో చేరవచ్చు.
ఈ స్కీమ్ లో ఖాతా తెరిచే విధానం..
- బ్యాంక్ ప్రతినిధిని లేదా బ్యాంకు మిత్రను కలిసి సంబంధిత ఫారంను, రిజిస్ట్రేషన్ ఫారంను పూర్తి చేయాలి.
- పారంలో అడిగిన అన్ని వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలి.(మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తో సహా)
- వయస్సును బట్టి ఎంత కాంట్రిబ్యూషన్ కట్టాలో బ్యాంకు నిర్ధారిస్తుంది.
- మీరు డిపాజిట్ చేసిన మొత్తం లేదా మీ సేవింగ్ అకౌంట్ నుంచి మీ కాంట్రిబ్యూషన్ తీసుకునే అధికారాన్ని బ్యాంకుకు కల్పించాలి.
- మీ ఖాతాలో కాంట్రిబ్యూషన్ కు కావాల్సిన మొత్తం లేనట్లయితే ఆ తరువాత అపరాధ రుసుంతో కలిపి బ్యాంకు వసూలు చేస్తుంది.
- ఖాతాలో కాంట్రిబ్యూషన్ వసూలు చేయడానికి 24 నెలల సమయం బ్యాంకు మనకు ఇస్తుంది.
- గడువు ముగిసేలోపు మనం కాంట్రిబ్యూషన్ కు కావాల్సిన మొత్తాన్ని డిపాజిట్ చేయలేకపోయినట్లయితే ఖాతాను బ్యాంకు మూసివేస్తుంది.
- ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు పారంలో తప్పనిసరిగా నామినీ పేరును ప్రతిపాదించాలి. పాలసీదారుడు మరణిస్తే పింఛను జీవిత భాగస్వామికి ఇస్తారు. ఇద్దరూ లేకపోయినట్లయితే పింఛను నిధిని నామినీకి ఇస్తారు.
60 సంవత్సరాల వయస్సు నుంచి మీరు, మీ మరణం తరువాత మీ జీవిత భాగస్వామి ప్రతి నెలా నిర్ధిష్టమైన పెన్షన్ పొందుతారు. మీ జీవిత భాగస్వామి తరువాత మీ నామినీ రూ.1.70లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు పొందుతారు.
- కనీస పెన్షన్ ప్రయోజనానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
- నెలవారి చెల్లించావలసిన సొమ్ము లబ్ధిదారుని వయస్సు మరియు ఎంచుకున్న పెన్షన్ సొమ్ముపై ఆధారపడి ఉంటుంది.
- కంట్రీబ్యూషన్ సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి బ్యాంక్ ద్వారా ‘ఆటో డెబిట్’ సదుపాయం ద్వారా తీసుకోబడుతుంది.