సీఎం జగన్ ఆరోగ్యశ్రీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 16 నుంచి కడప, కర్నూలు, ప్రకాశం,గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున్ సీఎం శ్రీ వైయస్.జగన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
2020 జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ప్రాజెక్టుగా చేపట్టారు. పైలట్ప్రాజెక్టులో భాగంగా అప్పటివరకూ ఉన్న 1,059 వైద్య ప్రక్రియలకు, మరో వేయి వైద్య ప్రక్రియలను పెంచి 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేశారు. అమల్లో వచ్చిన అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు. అంతేకాదు అమలయ్యే వైద్యప్రక్రియల సంఖ్యను 2,059 నుంచి 2146కూడా పెంచారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.