పోషణ్ అభియాన్ అమలులో ఏపీ అగ్రగామి 

 రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా

 నీతి అయోగ్ వార్షిక నివేదికలో వెల్లడి

విజ‌య‌వాడ‌ : పోషకాహార లోపాలకు ముగింపు పలుకుతూ శిశు మరణాలను నివారించేందుకుగాను కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకంగా ఉన్న పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపును దక్కించుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. నీతి అయోగ్ వెలువరించిన వార్షిక నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.  

నీతి అయోగ్ పలు అంశాలకు సంబంధించి ప్రతి సంవత్సరం వార్షిక నివేదికను విడుదల చేస్తుండగా, అందులో పోషణ్ అభియాన్ కార్యక్రమాల అమలు ఒకటిగా ఉందన్నారు. పరిపాలన-వ్యవస్థాగత యంత్రాంగం, సేవలు అందించడం – సామర్ధ్యాలు పెంచుకోవడం, వ్యూహం – ప్రణాళిక , కార్యక్రమాల అమలు వంటి నాలుగు అంశాల ఆలంబనగా నీతి అయోగ్ పోషణ్ అభియాన్ అమలులో ముందున్న రాష్ట్రాలను గుర్తించటం జరిగిందన్నారు. ఈ నాలుగు విభాగాలలోనూ తనదైన సత్తా చూపిన ఆంధ్రప్రదేశ్ అన్నింటా ప్రథమ స్థానంలో నిలిచి ఈ ప్రత్యేక గుర్తింపును పొందగలిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో , ఆయన సూచనల మేరకు చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగానే తమకు ఈ గుర్తింపు దక్కిందని కృతికా శుక్లా వివరించారు. 

ఈ పరిశీలనలో భారతదేశాన్ని పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి పనితీరును పరిగణనలోకి తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రాల జాబితాలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకోగా, చిన్న రాష్ట్రాలలో   మిజోరాం ప్రథమర్యాంకును దక్కించుకుందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో నాగర్ హవేలి గుర్తింపును సొంతం చేసుకుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహార యొక్క ప్రాధాన్యం తెలియజేయడం, ఆ దిశగా ఆహారం తీసుకునేలా అలవాటు చేసుకునేలా చేయడం, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఏ ఆహారం ఎంత మేరకు అవసరమో తెలియ జేయడం, పోషకాహారాల్లో ఏ తరహా శక్తి ఎంత మేర ఉంటుందో సమగ్రంగా అవగాహన కల్పించడం  ముఖ్య ఉద్దేశంగా పోషణ్ అభియాన్ పథకం పనిచేస్తుందని కృతికా శుక్లా వివరించారు.

మూస ధోరణులను విడనాడుతూ అంగన్ వాడీ కార్యకర్తలకు సులభతరమైన పనివిధానాన్ని అమలు చేస్తున్నామని ఆక్రమంలోనే రిజిస్టర్లను రాయడానికి బదులుగ ప్రతి అంగన్ వాడీ కార్యకర్తకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి దానిలో కామన్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ (CAS) యాప్ ను నిర్ధేశించామన్నారు. ఫలితంగా లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందించటం సాధ్యమైందన్నారు. ఈ యాప్ సమాయాను సారంగా గృహ సందర్శనల అవశ్యకతను తెలియచేస్తుందని,  ఫలితంగా సరైన సమయంలో పిల్లలకు ఖచ్చితమైన బరువులు, ఎత్తులు చూసి మొబైల్ అప్లికేషన్ లో అప్డేట్ చేసి వారి తల్లి తండ్రులులకు చిన్నరుల పోషక ఆహార పరిస్ధితిని తెలియచేయగలుగుతున్నారన్నారు.

CAS యాప్ ను ఉపయోగించి మెరుగైన సేవలు అందిస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రతినెల రూ.500 ప్రోత్సాహాకం అందిస్తుండగా, దాదాపు 80 శాతం కార్యకర్తలు వీటిని అందుకుంటున్నారని డాక్టర్ శుక్లా తెలిపారు. పోషణ్ అభియాన్ అమలులో భాగంగా ప్రతినెల అంగన్ వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్ ల సామర్ద్యాలను మెరుగుపరచటానికి శిక్షణ ఇవ్వడం ద్వారా నిరంతరం వారి పనితీరు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటున్నామని ఫలితంగానే జాతీయ స్ధాయిలో ఈ గుర్తింపును పొందగలిగామని తెలిపారు.

పోషణ్ అభియాన్ లో భాగంగా సామాజిక అధారిత కార్యక్రమలు, అన్నప్రాసన , శీమంతం, మూడుసంవత్సరాల పిల్లలను ప్రీస్కూల్ కు సిద్దం చేయటం,  పురుషులకు ఆరోగ్యవిషయాలపై అవగాహనా కల్పించటం, పోషణ వేడుక నిర్వహించి దానిలో గ్రామస్థులందరిని పాల్గొనేలా చేయటమే కాక, ప్రతి కార్యక్రమానికి రూ.250 చెల్లిస్తున్నామన్నారు. మరోవైపు పిల్లల బరువులు, ఎత్తులు చూసేందుకు ఆధునిక పరికరాలను సమకూర్చామని డాక్టర్ కృతిక తెలిపారు.

 

Leave a Comment