‘దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయి. పల్లెటూర్లలో సాయంత్రం 6 నుంచి 10 లోపు మూడు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (పవర్ కట్) ఉంటుంది. మునిసిపాలిటీలు పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత పవర్ కట్ ఉంటుంది. పెద్ద నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుంది.’ ఈ వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వదంతులను ఏపీ ఇంధన శాఖ ఖండించింది.
బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న సంగతి తెలిసిందే.. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు చర్యలు చేపట్టాయని ఇంధన శాఖ ప్రకటించింది. బొగ్గు కొనుగోలు నిమిత్తం రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కోకు అత్యవసరంగా రూ.250 కోట్ల నిధులు, రాష్ట్రానికి అదనంగా రోజుకు దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడున్నా కొనుగోలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. స్వల్ప కాలిక మార్కెట్ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణి సంస్థలను ఆదేశించడం జరిగింది.
కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపబడని విద్యుత్ వాటా నుంచి, వచ్చే సంవత్సరం జూన్ వరకు, ఆంధ్ర ప్రదేశ్ కోసం దాదాపు 400 మెగా వాట్లు చౌక ధర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు అభర్ధన పెట్టింది. సింగరేణి సంస్థతో సమన్వయము చేసుకుని మన రాష్ట్రము లో వున్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం నిరంతర ప్రయత్నం జరుగుతోంది. వి టి పి ఎస్ లోను మరియు కృష్ణపట్నంలోనూ కొత్త 800 వెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రారంభించడానికి మరియు తొందరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు చేపట్టింది.