టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి భూ కుంభకోణం కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరబాద్ లోని చంద్రబాబు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. అమరావతి రాజధానిలో భూముల కొనుగోలు, అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు.
చంద్రబాబుతో సహా మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ చేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ కింద నోటీసులు ఇచ్చారు. ఏపీ కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడంపై చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ లాండ్యస్ 1977, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు.