ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం సెక్రటేరియేట్ లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలపై నివేదికను సబ్ కమిటీ కేబినెట్ కి సమర్పించింది. సమావేశంలో తీసకున్న కీలక నిర్ణయాలు ఇవే..
వైఎస్సార్ చేయూత..
- నవరత్నాల అమల్లో భాగంగా వైఎస్సార్ చేయూతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేల ఆర్థిక సహాయం
- ఏడాదికి రూ. 18,142ల చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయం
- ఆగస్టు 12న అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించిన ప్రభుత్వం
- 24 నుంచి 26 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా
జగన్న తోడు..
- ‘జగనన్న తోడు’ కింద చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలకు కేబినెట్ ఆమోదం
- రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాలు అందించనున్న ప్రభుత్వం
- చిరువ్యాపారులు, తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేవాళ్లకు పథకం వర్తింపు
- అక్టోబరులో పథకం వర్తింపు
- దాదాపు 9 లక్షలమందికిపైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా
- ఏడాదికి దాదాపు రూ. 56 కోట్లు వడ్డీని భరించనున్న ప్రభుత్వం
వైఎస్సార్ సంపూర్ణ పోషణ..
తల్లులు, చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడిస్తున్న దాని కంటే అదనపు పౌష్టికాహారం అందించనుంది. 77 మండలాల్లో వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన చోట్ల వైయస్సార్ సంపూర్ణ పోషణను అమలు చేయనుంది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఈ ఏడాది గర్భిణులు, తల్లులు, పిల్లల పౌష్టికాహారం కోసం 1863.11 కోట్లు ఖర్చు చేయనుంది.
ఐదేళ్ల పాటు నివాసం తర్వాతనే..
ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు చేర్పులు చేసింది. ఇళ్లు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునేలా నిబంధనలు విధించారు.
స్థలాల అమ్మకానికి నిర్ణయం..
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్ శిక్షణా స్థలం కోసం 385 ఎకరాలు కేటాయింపు, కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బిల్డ్ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాల అమ్మకానికి కేబినెట్ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోద మద్ర వేసింది. తిరుపతిలో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటుకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది.
తల్లుల చేతికే రియింబర్స్ మెంట్ నిధులు..
జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్మెంట్ డబ్బును నేరుగా తల్లుల అక్కౌంట్లోకి వేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి త్రైమాసికం పూర్తికాగానే ఫీజురియంబర్స్మెంట్ డబ్బును తల్లులు ఖాతాల్లోకి వేయనుంది.
ఇంకా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..
- ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తికి కేబినెట్ ఆమోదం..
- రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
- ఏపీ అవుట్ సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ కోసం 55 పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్కు కేబినెట్ ఆమోదం
- గండికోట నిర్వాసితులను తరలించేందుకు రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం
- వెలిగొండ ప్రాజక్టులో ఆర్ అండ్ ఆర్కు రూ. 1301.56 కోట్లు
- తీగలేరు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ భూసేకరణ కోసం రూ.110 కోట్లు
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్కు 55 పోస్టులు
- సన్నిధి యాదవుల వారసత్వపు హక్కులను పరిరక్షించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం
- ఏపీ ఫైబర్ నెట్, చంద్రన్నకానుక, రంజాన్ తోఫా పథకాల్లో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రెండో నివేదికకు ఆమోదం
- ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం
- కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఏర్పాటుకానున్న ప్రాజెక్టు
- బోగాపురం ఎయిర్పోర్టులో లో 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి 2700 నుంచి 2200 ఎకరాలకు ఎయిర్పోర్టు కుదింపు
- కుదింపు స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి కంపెనీ అంగీకారం