ఆగస్టు నుంచి గ్రామాలకు సీఎం జగన్..

ఎవరి నుంచి తమకు పథకాలు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదని, ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. గురువారం గ్రామ, వార్డు సచివాయాలు, వార్డు వలంటీర్ల వ్యవస్థపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితా, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన నంబర్ల జాబితా, సేవల జాబితా, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ,  వార్డు, సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. మార్చి 2021 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సొంత భవనాల నిర్మాణం పూర్తికావాలన్నారు.

ఈనెల 20లోగా జియో ట్యాగింగ్, వెరిఫికేషన్‌ పూర్తవుతుందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ ఉన్న 17097 పోస్టుల భర్తీకి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూలై నెలాఖరులో పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామన్నారు.  వైద్యశాఖలో పోస్టులు, గ్రామ–వార్డు సచివాలయాల్లో పోస్టులు అన్నీ కలిపి వాటికి ఒకేసారి షెడ్యూల్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

వలంటీర్లకు శిక్షణపైనా ఆరా

వలంటీర్లకు సెల్‌ఫోన్లు ఇచ్చినందున డిజిటిల్‌ పద్ధతుల్లో వారికి శిక్షణ ఇచ్చే ఆలోచన చేయాలని సీఎం సూచించారు. వారు అవగాహన చేసుకున్నరో లేదో అన్న దానిపై వలంటీర్ కు ప్రశ్నావళి పంపాలన్నారు. 

పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలి..

పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రకటించిన సమయంలోగా సకాలానికే పథకాలు అందాలన్నారు. ఎవరి దరఖాస్తులను కూడా తిరస్కరించకూడదన్నారు. అర్హత ఉన్న వారికి పథకాలు రాకపోతే… అధికారులను బాధ్యులను చేస్తానని సీఎం హెచ్చరించారు. 

పెన్షన్, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీకార్డు, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలని, మొదట వీటిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటిస్తానన్నారు.

 

Leave a Comment