రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత సమయంలోలో వినతులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పర్సుయేషన్ అండ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) కాల్ సెంటర్ ను సీఎం జగన్ ప్రారంభించారు. యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా ఈ పీఎంయూ అప్రమత్తం చేస్తుంది. మొదటగా నాలుగు పీఎంయూ సర్వీసులు, అక్టోబర్ నుంచి 543కి పైగా సేవలను అమలు చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం జగన్ విడుదల చేశారు. మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ బోర్డులపై ప్రభుత్వం అమలు చేసే పథకాలు, వాటి మార్గదర్శకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. అర్బన్ హెల్త్ క్లినిక్స్పై దృష్టి పెట్టాలన్నారు.
గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్ల పట్టాలలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నా.. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్ ప్లాన్కు సన్నద్ధం కావాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని అధికారులు వెల్లడించారు. ల్యాండు రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్ ప్రకటించాలని సీఎం జగన్ తెలిపారు. ఏ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయని సీఎం సూచించారు.