ఆస్పత్రిలో గొడవ.. ఒకరికొకరు కొట్టుకున్న డాక్టర్, నర్సు..!

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది.. కరోనా రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా రోగులను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో వారికి బెడ్లు సమకూర్చడం నుంచి చికిత్స అందించడం వరకు ప్రతిదీ తలకు మించిన భారంగా మారింది. దీంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. ఈక్రమంలో పలు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్ కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చివరికి సహనం కోల్పోయి నర్సు డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టింది. దీంతో డాక్టర్ కూడా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీసుల ముందే జరిగింది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్ జీ మిశ్రా కూడా ఘటనపై ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. కొట్లాడుకున్న డాక్టర్, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడారు. ఇద్దరు కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాము సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించామని చెప్పారని మిశ్రా చెప్పారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

Leave a Comment