బిస్కెట్ అనుకుని ఎలుకల మందు తిన్న చిన్నారి మృతి..!

ఇంట్లో ఎలుకలను చంపేందుకు అక్కడక్కడ ఎలుకల మందు బిస్కెట్లను పెడుతుంటాం.. ఆ మందుకు ఓ చిన్నారి బలైపోయింది. బిస్కెట్ అనుకుని ఎలుకలను చంపే మందు తిన్న ఆ చిన్నారి మృతి చెందింది. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో చోటుచేసుకుంది. 

కొత్తతండాకు చెందిన తేజవత్ మంగీలాల్, శిరీష దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవినం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరిలో సాత్వికాబాయ్(5) ఆదివారం సాయంత్రం వీధిలో తోటి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్లింది. ఆ చిన్నారికి రోడ్డుపై ఎలుకల మందుకు సంబంధించిన ప్యాకెట్ దొరికింది. 

అవి బిస్కెట్లలాగా ఉండటంతో వెంటనే తినేసింది. అలాగే చేతిలో కవర్ పట్టకుని ఇంటికి వచ్చింది. అయితే తల్లిదండ్రులు నిరక్ష్యరాసులు కావడంతో అదేంటో గమనించకుండానే ప్యాకెట్ ను బయటపడేశారు. ఆ తర్వాత అన్నం తిని అందరూ నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో చిన్నారి సాత్వికా అస్వస్థతకు గురైంది. 

వాంతులు, నోటి నుంచి వాసన రావడంతో తల్లిదండ్రుల ఆందోళనకు గురయ్యారు. సోమవారం ఉదయం కారేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాగా ఆలస్యం కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కొందరి నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. 

Leave a Comment