40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్తారు : నారా లోకేష్

టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులేవీ మరిచిపోయేది లేదని, వడ్డీతో సహా చెల్లించి తీరుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రజల తరపున ప్రభుత్వంపై యుద్ధం చేసేవారిని జగన్ జైళ్లో పెట్టిస్తున్నారని విమర్శించారు. తమ హయాంలో అవినీతి జరిగిన్టుల ఒక్క ఆధారమైనా చూపించారా అని ప్రశ్నించారు. 

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్ష కోట్లు దోచుకోవడం వల్లే చాలా మంది అధికారులు జైలుకెళ్లారన్నారు. రానున్న రోజుల్లోనూ వందల మంది అధికారులు జైలుకెళ్లే పరిస్థితి ఉందన్నారు. మంత్రులందరికీ అసహనం పెరిగిపోయిందన్నారు. సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అంటూ ఇవ్వలేకపోయిన మంత్రి అసహనంతో మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ పేరు కూడా అన్నిసార్లు తలవని మంత్రులు చంద్రబాబు పేరు జపిస్తున్నారని అన్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చంద్రబాబే వైసీపీ నేతల కలలోకి వస్తున్నారని తెలిపారు. 

ఒక మతంపై దాడి జరుగుతున్నప్పుడు సీబీఐ విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేశారు. ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చని, వరుస సంఘటనలు చూస్తుంటే కుట్రకోణం స్పష్టమవుతోందని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదని, కానీ ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను వ్యతిరేకిస్తే అక్రమకేసులు లేదా దాడులకు దిగుతున్నారని విమర్శించారు. 

కొల్లు రవీంద్ర, అచ్చెన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి లపై పెట్టింది ముమ్మాటికీ దొంగ కేసులే అన్నారు. వింత వింత కేసులన్నీ ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారన్నారు. పెళ్లికి వెళ్లారని యనమల, చినరాజప్ప లపై కేసులు పెట్టారని, అయ్యన్న, కూన రవికుమార్ ఇలా 36 మంది తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే దొంగ కేసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. 

తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని, ఇళ్ల స్థలాల సేకరణ లో జరిగిన అవినీతిలో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్లటం ఖాయమని స్పష్టం చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, కనీసం 40 మంది జైలుకెళ్తారు రాసిపెట్టుకోండని తెలిపారు. పేదలకి గత ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేసిన చోటే కేసులు ఉన్నాయన్నారు.  మిగిలిన నియోజకవర్గాల్లో భూములు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసులు ఉన్నాయంటూ భూముల పంపకం వాయిదా వేస్తున్నారని స్పష్టం చేశారు.

 

Leave a Comment