మహారాష్ట్రలో ఘోరం..15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారం..!

మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దాడులు ఆగడం లేదు.. మానవ మృగాలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతునే ఉన్నారు. చిన్నపిల్లలను సైతం ఈ నీచులు వదలడం లేదు. తాజాగా 15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. బాధితురాలు బుధవారం రాత్రి డోంబివాలోని మాన్పాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

వివరాల మేరకు 15 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడు జనవరిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో దానిని వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ మిగితావారు కూడా ఆమెపై లైంగిక దాడి చేశారు.  అలా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 29 మంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 26 మందిని అరెస్టు చేశారు. మిగితా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారందరిపై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏసీపీ దత్తాత్రేయ వెల్లడించారు.    

Leave a Comment