రూ.3 లక్షలకు అమ్మకానికి 17 ఏళ్ల అమ్మాయి..!

పేదరికం ఎంతటి పని చేయడానికైనా ఉసిగొలుపుతుంది. అలాంటి పరిస్థితే ఓ కుటుంబానికి వచ్చింది. తమ అమ్మాయికి పెళ్లి చేయలేక రూ.3 లక్షలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రులు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల మేరకు నవాబ్ పేట మండలం హాజిలాపూర్ గ్రామ పరిధిలోని గాలోనికుంటకు చెందిన రవినాయక్, వాలమ్మ దంపతులకు నలుగురు సంతానం..

హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. హైదరాబాద్ లో వీరికి షాద్ నగర్ కు చెందిన వ్యక్తితో పరిచయమైంది. తమ రెండో కూతురు(17)కు ఎలాపెళ్లి చేయాలన్న దిగులు వారికి పట్టుకుంది. వీరు షాద్ నగర్ కు చెందిన వ్యక్తితో తమ సమస్యలు చెప్పుకున్నారు. 

వీరి నిస్సహాయతను ఆ షాద్ నగర్ వ్యక్తి గుర్తించాడు. వారి కూతురు అమ్మేందుకు స్కెచ్ వేశాడు. రాజస్తాన్ కు చెందిన వ్యక్తితో పెళ్లి చేద్దామని అమ్మాయి తల్లిదండ్రులను చెప్పాడు. ఆ పెళ్లి కొడుకు ద్వారా రూ.3 లక్షలు ఇప్పిస్తామని ఒప్పించాడు. దీంతో వారు సరే అన్నారు. శుక్రవారం నవాబుపేట నుంచి అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. 

అయితే ఈ విషయం దుబాయ్ లో ఉంటున్న రవినాయక్ సోదరుడికి తెలిసింది. వెంటనే అతడు దుబాయ్ నుంచి నవాబ్ పేట పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ దంపతులను, బాలికను పట్టుకున్నారు. వారితో పాటు షాద్ నగర్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను మహబూబ్ నగర్ స్టేట్ హోంకు తరలించారు.     

Leave a Comment