అమరావతి : అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం వంటి చర్యల వల్ల బలైపోయేది దానిపై సంతకాలు చేసిన అధికారులే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలను తరలిస్తూ జీవో నంబర్ 13ను అర్ధరాత్రి వేళ జారీ చేయడం నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయడానికా అని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయం ఆధ్వర్యంలో పనిచేయాల్సిన రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాన్ని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఆ విషయం అందులో పనిచేసేవారికీ అర్థం కాకుండా ఉందని విమర్శించారు. ఇలా తరలించడం వల్ల తాము కోర్టు కేసుల్లో ఎక్కడ ఇరుక్కుంటామోనని భయపడుతూ రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అధికారి సెలవు పెట్టేద్దామన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోందని, దీని బట్టి వారు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం దొడ్డి దారి జీవోలు ఆపాలని హితవు పలికారు.