టీ20 వైస్ కెప్టెన్సీ రేసులో ఇద్దరు ఆటగాళ్లు? అనూహ్యంగా తెరమీదకు మరో ఆటగాడి పేరు

Team India T20: టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు విరాట్ కోహ్లీ గురువారంనాడు సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్‌గా కోహ్లీ పదవీకాలం నవంబరు మాసంతో ముగియనుంది. 2017 నుంచి కోహ్లీ టీమిండియా టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. విరాట్ కోహ్లీ స్థానంలో తదుపరి కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా సారథి కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మ‌తో పాటు కేఎల్ రాహుల్, రిషత్ పంత్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అటు రోహిత్‌ శర్మకు కెప్టెన్‌గా ప్రమోషన్ వస్తే అతని స్థానంలో వైస్ కెప్టెన్ ఎవరు కావచ్చన్న అంశంపై కూడా చర్చ మొదలైయ్యింది. వైస్ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా ఇప్పుడు మరో ఆటగాడి పేరు తెరమీదకు వచ్చింది. అన్ని ఫార్మెట్లలోనూ రాణిస్తున్న ఫేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా వైస్ కెప్టెన్‌గా సరైనా ఎంపిక అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు పీటీఐ వార్తా సంస్థ ఓ కథనంలో వెల్లడించింది. వైస్ కెప్టెన్సీ రేసులో రిషత్ పంత్ అందరికంటే ముందున్నట్లు తెలుస్తోంది. గతంలో టీమిండియా A జట్టుకు సారథ్యంవహించిన పంత్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అటు కేఎల్ రాహుల్‌కు రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో లేని కొన్ని సందర్భాల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.

Leave a Comment