తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జనం గుండెల్లో చెరగని స్థానం ఆయనది.. రాజన్న అంటే ఒక ఆత్మీయ పలకరింపు.. అలాంటి మహానేత అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ 2009 సెప్టెంబర్ 2న తిరిగారిని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు ఓ చేదు జ్ఞాపకం లాంటిది.
వైఎస్సార్ పై ఉన్న అభిమానంతో ఓ వీరాభిమాని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 60 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాల్లో ఇదే ఎత్తయిన విగ్రహం.. వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా పలమనేరు సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో వైఎస్సార్ సర్కిల్ వద్ద గురువారం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
పలమనేరుకు చెందిన దేవీ గ్రూప్ మేనేజింగ్ పార్టనర్, గంగవరం మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సి.వి.కుమార్ తన స్థలంలో సొంత నిధులతో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విగ్రహాన్ని తమిళనాడుకు చెందిన కాళీశ్వరన్ 9 నెలలు కష్టపడి రూపొందించారు. మొత్తానికి ఈ విగ్రహం ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.