ప్రేమించిన వ్యక్త మరో పెళ్లి చేసుకుంటుండంతో తట్టుకోలేకపోయింది. తనను కాదని మరో పెళ్లి చేసుకుంటున్నాడని కళ్యాణ మండపంలో పెళ్లి ఆపేందుకు ప్రయత్నం చేసింది. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం బైపాస్ రోడ్డులోని కృష్ణా ఫంక్షన్ హాలులో చోటుచేసుకుంది. వివరాల మేరకు మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన శ్రీనాధ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో పెళ్లి చేసుకుంటున్నాడని రజనీ అనే యువతి ఆరోపించింది.
ప్రేమించిన వ్యక్తి మరో పెళ్లి చేసుకుంటుండంతో కళ్యాణ మండపం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగింది రజినీ. పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన వరుడి బంధువులు రజినీని కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కళ్యాణ మండపంలోనే విచక్షణారహితంగా దాడి చేశారు.
శ్రీనాథ్ తాను మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని, పెళ్లి విషయం గురించి అడిగేసరికి మొహం చాటేశాడని రజినీ చెబుతోంది. అదే విషయం పెళ్లి మండపంలో తాను నిలదీశానని, దీంతో అతని బంధువులు తనను కొట్టి బయటకు లాగిపడేశారని వాపోయింది. పక్కనే పోలీసు ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది..