కపిల్ మిశ్రాకు వై ప్లస్ సెక్యూరిటీ..

ఢిల్లీలో ఇటీవల హింసను, అల్లర్లను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. వాస్తవానికి ఈయనపై ఎఫ్ఐఆర్ దాఖాలు చేసి, కేసులు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..అయితే తనకు ప్రాణ హాని ఉందని మిశ్రా చెప్పుకోవడంతో ప్రభుత్వం ఈ సెక్యూరిటీ కల్పించింది. ఈ కేటగిరీ కింద ఈయనకు 24 గంటలూ భద్రత ఉంటుంది. సాయుధులైన గార్డులు నీడలా మిశ్రా వెన్నంటే ఉంటారు.

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఏఏను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులను, ఒక వర్గం వారిని ఉద్దేశించి పరోక్షంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన మిశ్రా పైన, ఇతర బీజేపీ నేతలపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ప్రతిపక్షాలు..ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనను హతమారుస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల తనకు భద్రత పెంచాలని మిశ్రా సర్కార్ ను కోరారు. 

ఈయనతో బాటు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ ఇంటి ఇతర కమలం పార్టీ నేతలు కూడా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని  వారిపై ఆరోపణలు వచ్చాయి. ఇలా ఉండగా..కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఈ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలతో హింసను రెచ్చగొట్టారని, అందువల్ల వీరిపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించవలసిందిగా కోరుతూ బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మీ వైఖరేమిటో తెలపాలని కోర్టు..కేంద్రాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలపై కోర్టులోనే తాము దీటైన జవాబు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 

Leave a Comment