మంగళగిరి : ప్రజా వ్యతిరేక విధానాలను కచ్చితంగా అడ్డుకుంటామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మట్లాడుతూ.. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపితే వాటిని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఇకనైనా మార్చుకోవాలన్నారు. ఇలాంటి నిర్ణయాలే మళ్లీ తీసుకుంటే వాటినీ అడ్డుకుంటామన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆషామాషీగా వెళ్లడం కుదరదన్నారు. మండలి వ్యతిరేకించిన రెండు బిల్లులను గవర్నర్ ప్రసంగం ద్వారా తీసుకురావాలని చూస్తున్నారన్నారు. జగన్ను చరిత్రలో ఏ వ్యక్తితోనూ పోల్చలేకపోతున్నామన్నారు. హిట్లర్, తుగ్లక్, ముస్సోలిని, నీరో.. వీళ్లందరి మనస్తత్వాలతో కూడిన ఆలోచనా తీరు జగన్ది అన్నారు. రాష్ట్రాభివృద్ధిని సీఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం నష్టపోతున్నా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అని యనమల ఆరోపించారు.
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు : అచ్చెన్నాయుడు
బలహీన వర్గాలకు తొమ్మిది నెలల్లో వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. కాపు నేస్తం ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. బీసీలకు కూడా పథకాలు అందించాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ కేసు వేసిందని మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత సుప్రీం కోర్టుకు వెళ్తే మాపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి అండగా ఉంది బీసీలే అన్న విషయం అందరికీ తెలిసిందేనని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.