లైంగిక వేధింపులు.. విజయవాడలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. టీడీపీ నేత అరెస్ట్..!

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన విద్యాధరపురం కమ్మరిపాలెం సెంటర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కమ్మరిపాలెం సెంటర్ ప్రాంతంలో తనను వేధిస్తున్నాడని టీడీపీ నేత వినోద్ జైన్ పేరును సూసైడ్ నోట్ లో రాసింది. బెంజి సర్కిల్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను వినోద్ జైన్ వేధింపులకు పాల్పడ్డాడు. పలుమార్లు వద్దని వారించినప్పటికీ అతడు వినలేదు. 

దీంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో భవిష్యత్ ఉన్న చదువుల తల్లి కామాంధుడి వేధింపులకు అర్ధాంతరంగా తనువు చాలించింది. దీంతో 14 ఏళ్లకే ఈ ముద్దుబిడ్డకి వందేళ్లు నిండిపోయాయి. ఈ ఘటనపై టీడీపీ నేత వినోద్ జైన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత రెండు నెలలుగా బాలికను వేధిస్తున్నాడని తెలిపారు. వినోద్ జైన్ గత ఎన్నికట్లో టీడీపీ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు. ఈనేపథ్యంలో టీడీపీ అధిష్టానం వినోద్ జైన్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

Leave a Comment