గమ్యం చేరే వరకూ యాప్ ద్వారా ట్రాక్ చేస్తాం..

 

విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు సోమవారం నుంచి వస్తారని, అమెరికా నుంచి వచ్చే వారు వైజాగ్, విజయవాడు, తిరుపతి కాకుండా ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి విమానాశ్రయాలకు చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. 

విదేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉచితంగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌ కేంద్రాలకు చేరడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. 

లాక్‌డౌన్‌ అనంతరం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి కదలిక ప్రారంభమైతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి ప్రోటోకాల్‌ పాటించాలన్న దానిపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. 

ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాలి, తర్వాత ఆ వ్యక్తి అనుసరించాల్సిన ఐసోలేషన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఒక ప్రోటోకాల్‌ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

యాప్ ద్వారా ట్రాక్ చేస్తాం..

వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్‌ పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశిస్తారని సీఎంకు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి పొందిన గమ్యానికి చేరుకోవడం వరకూ యాప్‌ ద్వారా ట్రాక్‌ చేస్తామని వివరించారు. ఆ తర్వాత  వారి వివరాలను ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త, అలాగే ప్రతి సచివాలయంలో ఉన్న హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయాలని సీఎం తెలిపారు. 

ప్రజల్లో భయాన్ని పోగొడుతూ.. భౌతిక దూరం లాంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, తద్వారా వైరస్‌తో సమర్థవంతంగా పోరాడగలమని సీఎం పేర్కొన్నారు. వీటన్నింటికీ సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొజీజర్స్‌ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. 

అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆ మేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 

 

Leave a Comment