మే 3 వరకూ లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలి

గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున ప్రారంభం కావాలి

కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

రెడ్ మరియు ఆరెంజ్ జోనల్లో కంటైన్మెంట్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై గురువారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కొవిడ్-19 పరిస్థితి మరియు కంటైన్మెంట్ ప్రణాళికల అమలు ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలుగా విభజన అజెండాగా ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజీవ్ గౌబా మాట్లాడుతూ మే 3వరకూ లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని సిఎస్ లను ఆదేశించారు.

 కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ విస్తృతంగా జరగాలని చెప్పారు. దేశవ్యాప్తంగా సరుకు రవాణా వాహనాలకు అనుమతించినందుకు వాటి విషయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 

గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కావాలి…

అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్లు లో ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. 21 రోజుల వ్యవధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆలాంటి జిల్లాను గ్రీన్ జిల్లాగా గుర్తించాలన్నారు. 

లాక్ డౌన్ అమలు చేస్తాం..

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే  రాష్ట్రంలో 4 జిల్లాలు రెడ్ జోన్లుగా, 8 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, ఒక జిల్లా గ్రీన్ జోన్ కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. మే 3 వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ రాజీవ్ గౌబకు వివరించారు.

 

Leave a Comment