జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో అత్యధిక నగదు కోటి రూపాయలు గెలుచుకున్న తొలి విజేతగా తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన రాజా రవీంద్ర రికార్డు సృష్టించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఇప్పుడు హాట్ టాపిక్.. గతంలో కోటి రూపాయల ప్రశ్నను ముగ్గురు ఎదుర్కొన్నారు. అయితే దానిని సైరైన సమాధానం చెప్పలేక వదులుకున్నారు. కానీ రాజా రవీంద్ర మాత్రం వరుసగా సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నారు.
ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో కేవలం 2.637 సెకన్లలో సమాధానం చెప్పి హాట్ సీట్ కి చేరుకున్న రాజా రవీంద్ర.. సోమవారం జరిగిన షోలో 12 ప్రశ్నలకు సమాధానం చెప్పి 12,50,000 గెలుచుకున్నారు. మూడు లైఫ్ లైన్లలో కేవలం ఒక్క దానిని మాత్రమే ఉపయోగించుకున్నారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జరిగిన షోలో మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కోటీ రూపాయలు గెలుచుకున్నారు..
రూ.25 లక్షల ప్రశ్న..
2020లో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్ భాషలో ‘40 రోజులు’ అని అర్థం వచ్చే ఒక పదం నుంచి వచ్చింది?
ఎ)లాక్ డౌన్
బి)ఐసోలేషన్
సి)క్వారంటైన్
డి)పాండమిక్
ఈ ప్రశ్నకు రాజా రవీంద్ర లైఫ్ లైన్ ఉపయోగించుకుని క్వారంటైన్ అని సరైన సమాధానం చెప్పారు. దీంతో ఆయన రూ.50లక్షల ప్రశ్నకు చేరుకున్నారు.
రూ.50 లక్షల ప్రశ్న..
జాతీయ వైద్యుల దినోత్సం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు?
ఎ)మిజోరాం
బి)పశ్చిమబెంగాల్
సి)ఉత్తరప్రదేశ్
డి)కేరళ
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు రాజా రవీంద్ర కొద్ది సేపు ఆలోచించారు. ఎలాంటి లైఫ్ లైన్ తీసుకోకుండా ఆప్షన్ బీ అంటూ ఆత్మవిశ్వాసంతో ఆయన సరైన సమాధానం చెప్పి రూ.50 లక్షలు గెలుచుకున్నారు.
కోటి రూపాయల ప్రశ్న ఇదే..
1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్ కు, ఎవరు అధ్యక్షత వహించారు?
ఎ)రంగనాథ్ మిశ్రా
బి)రంజిత్ సింగ్ సర్కారియా
సి)బీపీ మండల్
డి)ఫజల్ అలీ కమిషన్
ఈ ప్రశ్నకు కొద్ది సేపు ఆలోచించి మరో లైఫ్ లైన్ తీసుకున్నారు. తర్వాత ఆప్షన్ డీని లాక్ చేసేయండి అంటూ సమాధానం చెప్పారు. దీంతో ఎవరు మీలో కోటీశ్వరులు చరిత్రలోనే కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర నిలిచారు.