సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకోవాలి : సీఎం

పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రతి పనికి కూడా సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. బుధవారం పోలవరం పనులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.  కోవిడ్‌–19 నేపథ్యంలో సిమెంటు, స్టీల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు సీఎంకు వివరించారు. 

నెల రోజులకుపైగా అత్యంత విలువైన సమయం కోవిడ్‌ కారణంగా పోయిందన్నారు. ఏప్రిల్‌ 20 నుంచి కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. ఇప్పుడిప్పుడే సిమెంటు, స్టీల్‌ సరఫరా మొదలవుతోందని అధికారులు తెలిపారు. 

సిమెంటు, స్టీల్‌ సరఫరా ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. స్పిల్‌వే జూన్‌ నెలాఖరు పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. డిజైన్ల అప్రూవల్స్‌ వీలైనంత త్వరగా తెప్పించాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. గత సంవత్సరం గోదావరి వరదలను చూశామని, ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్నికూడా శరవేగంతో తరలించాలని సీఎం తెలిపారు. వారికి సంబంధించిన సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్‌–2, వెలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులు  నిర్దేశించుకున్న కాలంలోగా పూర్తికావాలని సీఎం ఆదేశించారు. 2020లో ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారుల హామీ ఇచ్చారు. 

 

Leave a Comment