మోడీజీ..రాష్ట్రానికి రండి

 ఆహ్వానించిన జగన్‌

ఢిల్లీ :  హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రధానికి ఆయన నివేదించారు. విభజన అంశాలు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై సీఎం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని.. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి రావాలని మోడీని జగన్‌ ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు అందజేయాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు ప్రధానికి సీఎం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖను ఆదేశించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

పోలవరం పెండింగ్‌ నిధులపై..

2021 నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రధానికి అందజేసిన వినతిపత్రంలో సీఎం పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,549 కోట్లకు చేరిందని, దీనిలో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్లు అవసరమవుతుందని సీఎం తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ ఫిబ్రవరి 2019న పోలవరం అంచనాలను రూ.55,549 కోట్లుగా అంచనా వేసిందని గుర్తు చేశారు. దీనికి పాలనాపరమైన అనుమతులు ఇంకా రాలేదని.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని కోరారు. ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,320 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తం విడుదల చేయాల్సిందిగా జలవనరుల శాఖను ఆదేశించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ‘హోదా’ ఇవ్వండి..

అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం కోరారు. ‘హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులు అవసరం లేదంటూ 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని లేఖలో జగన్‌ ప్రస్తావించారు. ప్రత్యేకహోదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమైనందున కేంద్రమే తగిన నిర్ణయం తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం పేర్కొన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని జగన్‌ గుర్తు చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్‌ అంచనా వేసిందని, కేంద్రం నుంచి ఇంకా రూ.18,969.26 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.

పెండింగ్‌ గ్రాంట్లను విడుదల చేయండి

ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఇది తక్కువేనని ప్రధానికి అందజేసిన వినతిపత్రంలో సీఎం పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప ఉక్కు కర్మాగారం, రామాయపట్నం పోర్టు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని జగన్‌ కోరారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులనూ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెనుకబడిన 7 జిల్లాలకు గడిచిన ఆరేళ్లలో కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని.. గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరారు. 

పరిపాలన వికేంద్రీకరణపై..

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానికి సీఎం తెలిపారు. దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ-అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం 2020కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

మండలి రద్దు ప్రక్రియ పూర్తి చేయించండి

శాసనమండలి రద్దు అంశాన్ని సీఎం వినతిపత్రంలో పేర్కొన్నారు. గడిచిన రెండు నెలల్లో పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన బిల్లులను మండలి అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మూడింట రెండొంతుల మెజారిటీతో శాసన మండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చేసిందని సీఎం ప్రధానికి తెలిపారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపామని.. ఈ అంశంలో తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని మోదీకి జగన్‌ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఏపీ దిశ చట్టం-2019కు ఆమోదం తెలపాలని కోరారు.

Leave a Comment