పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు..!

రేణుదేశాయ్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ధ్వజం

తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ధ్వజమెత్తారు. కర్నూలులో పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పవన్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.  కర్నూలులో 2017లో బాలికపై జరిగిన హత్యాచారం జరిగితే ఇప్పుడు న్యాయం చేయాలని పవన్‌ అడుగుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై న్యాయం చేయాలని ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ అడగడం ఏంటని, చంద్రబాబు సూచన మేరకే ఆయన ఇప్పుడు కర్నూలు వచ్చారా అని, ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌, ఛార్జ్‌షీట్‌ వేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనపై మరలా విచారణ జరిపించాలని బాలిక తల్లిదండ్రులు కోరారన్నారు. వారి విజ్ఞప్తి మేరకు మళ్లీ విచారణ జరిపిస్తున్నామన్నారు. విచారణ కోసం ఒక మహిళా అధికారిని ప్రభుత్వం నియమించిందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన సంఘటనపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్లు పవన్‌ మాట్లాడుతున్నారన్నారు.

ఇంగిత జ్ఞానం లేకుండా వాఖ్యలు..

పవన్‌ వల్ల రేణు దేశాయ్‌ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి ‘దిశ’ చట్టం తీసుకొచ్చారన్నారు. 21 రోజుల్లో బాధితులకు న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. కర్నూలులో జరిగిన సంఘటనపై చంద్రబాబు పవన్‌ నిలదీయాలన్నారు.  హత్యాచారానికి గురైన బాలిక పేరు ప్రస్తావించకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా పవన్‌ కల్యాణ్‌కు లేదని విమర్శించారు. ఇప్పటికే బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతో డీజీపీని కలిశామన్నారు. పవన్‌ రోడ్డు మీదకు రాకముందే సీబీఐ విచారణకు పరిశీలించాలని డీజీపీని కోరామన్నారు. పవన్‌ కల్యాణ్‌ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బాలిక పేరు చెప్పుకుని ఆయన కర్నూలులో అడుగుపెట్టారన్నారు. అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న పవన్‌కు సీమలో అడుగుపెట్టే అర్హత లేదని మండిపడ్డారు.

 

Leave a Comment