ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?: చంద్రబాబు

అమరావతి: స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మీడియా సమావేశం ద్వారా అజ్ఞానాన్ని ఆయన బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరోనా వైరస్‌ మహమ్మారిగా మారిందని.. దీని బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటిందని.. 5వేల మందికి పైగా చనిపోయారని చెప్పారు. చైనా, ఇటలీ దేశాల్లో ఔషధ దుకాణాలు తప్ప అన్నింటినీ మూసివేశారన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అమెరికా రూ.3.50లక్షల కోట్లు కేటాయించిందని చంద్రబాబు వివరించారు. ఈ మహమ్మారి ప్రభావంతో లండన్‌లోనూ స్థానిక ఎన్నికలను నిలిపివేశారని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి ఈ స్థాయిలో ఉన్నా జగన్‌ ఎస్‌ఈసీపై ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఎవరు చెప్పినా వినరు అనేదానిపై సీఎం జగన్‌ వ్యాఖ్యలే ఉదాహరణ అని ఆక్షేపించారు. 

ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారా?

కరోనా వైరస్‌ చాలా ప్రమాదకరమని అన్ని దేశాలు హెచ్చరిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. కరోనా వ్యాప్తి చెందితే మనదేశంలో ఆస్పత్రులు కూడా సరిపోవని.. గ్రామాలన్నీ క్వారంటైన్లు మారిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఈ సీఎంకు లేదని.. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? అని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘ఏ ఒక్క రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దేశం మొత్తానికి ప్రమాదం. ఒక సీఎం ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారా? జగన్‌కు సర్వాధికారాలు ఎవరిచ్చారు? రాజ్యాంగం నుంచే ఆయనకు అధికారాలు వచ్చాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ. ఎన్నికల నియమాలు అన్ని పార్టీలకు ఒకే విధంగా ఉంటాయి. రాజకీయాలు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఈ సీఎంకు పట్టడం లేదు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. 

రమేశ్‌కుమార్‌ను మేం నియమించలేదు

స్థానిక ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటే తాము గౌరవించాలా? అని ప్రశ్నించారు. తెదేపా నేతల ఇంటికి తెల్లవారుజామునే వెళ్లి బెదిరించారని.. 111 మంది తెదేపా అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని చెప్పారు. పులివెందుల రాజకీయాన్ని రాష్ట్ర మొత్తం చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. ‘‘నేను అధికారంలో ఉన్నప్పుడూ ఇలాగే చేసి ఉంటే వైకాపా పరిస్థితి ఎలా ఉండేది? ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను మేం నియమించలేదు. నేను సీఆర్‌ బిశ్వను ఎస్‌ఈసీగా ప్రతిపాదించా. అప్పటి గవర్నర్‌ గవర్నర్‌ నరసింహన్‌ మాత్రం రమేశ్‌కుమార్‌ను ప్రతిపాదించారు. ఆవిధంగా రమేశ్‌కుమార్‌ నియామకం జరిగింది. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ఆయన నియామకాన్ని జగన్‌ నాకు ఆపాదిస్తున్నారు’’ అని తెదేపా అధినేత వివరించారు.

 

Leave a Comment