ఎన్నికల నిలుపుదలపై హైకోర్టులో విచారణ

 అమరావతి  : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలపై సోమవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక ఎన్నికలను తక్షణమే జరిపించాలన్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పిటిషన్‌ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇదే అంశంపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. 

కాగా, కరోనాను సాకుగా చూపుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a Comment