రాష్ట్రంలో ఆరోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. సబ్ సెంటర్ల నుంచి మెడికల్ కాలేజీల వరకూ నాడు –నేడు కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం కోసం ఏకంగా రూ.16,200 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించి అధికారులతో సమీక్ష చేశారు.
వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్ల ఏర్పాటు..
- ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక విలేజ్ క్లినిక్ ఉండాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది.
- కోవిడ్ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా సబ్ సెంటర్ల రూపంలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- దీంట్లో భాగంగానే దాదాపు 10 వేల వైయస్సార్ క్లినిక్స్ నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది.
- వీటి కోసం దాదాపు రూ.2026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్ సెంటర్లలో నాడు–నేడు ద్వారా అవసరమైన సదుపాయాలను కల్పిస్తుంది.
- సబ్ సెంటర్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 4 వేల స్థలాలను గుర్తించారు. మరో 6 వేల సబ్సెంటర్లకు స్థలాలను గుర్తించాల్సి ఉంది.
- జూన్ 15లోగా స్థలాల గుర్తింపు కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
- వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
ప్రైమరీ హెల్త్ సెంటర్లు..
- రాష్ట్రవ్యాప్తంగా 1,138 పీహెచ్సీలు ఉన్నాయి. వీటిలో 149 కొత్త పీహెచ్సీల నిర్మాణం కోసం రూ. 256.99 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- మరో 989 పీహెచ్సీల్లో అభివృద్ధి పనులకోసం రూ. 413.01 కోట్లు ఖర్చుచేయనున్నారు. మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు..
- 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు నేడు కింద రూ.695 కోట్ల ఖర్చు చేయనున్నారు.
- 169 కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు..
- రాష్ట్రంలో పాత మెడికల్ కాలేజీలు 11 ఉన్నాయి. వీటితోపాటు అటాచ్డ్ ఇనిస్ట్యూషన్స్ టు మెడికల్కాలేజీలు 6, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి.
- వీటన్నింటి కోసం రూ.6100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
- ఇవికాక 15 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు….సూపర్ స్పెషాల్టీ, క్యాన్సర్, ఇన్సిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ కోసం మొత్తంగా రూ. 6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
- ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
- కొత్తగా నిర్మించదలచిన మెడికల్ కాలేజీల నిర్మాణ రీతులపై నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు.
- నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతలో రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
- మొత్తం ప్రజారోగ్య రంగంలో నాడు –నేడు, కొత్తవాటి నిర్మాణాలకోసం రూ.16,200 కోట్లకుపైనే ఖర్చు అవుతుందని అంచనా.