ఫ్రూట్ కిట్ల విక్రయాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్లకు లేఖలు రాశారు. కర్నూలు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన రూ.100కే పండ్ల కిట్ అమ్మకం విజయవంతమైనందున రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
లేఖలో పేర్కొన్న అంశాలు..
- స్థానికంగా దొరికే ఏవైనా ఐదు రకాల పండ్లను కిట్ రూపంలో తయారు చేసి రూ.100 చొప్పున విక్రయించాలి.
- ఇందుకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీవో), ఉద్యాన శాఖ సహకారాన్ని తీసుకోవచ్చు.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 350 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు తీసుకోవాలి.
- ఆ సూత్రం ఆధారంగా కరోనా వైరస్ వ్యాధి నివారణకు ఉపయోగపడే విటమిన్ ఏ, సీ ఉండే పండ్లను పంపిణీ చేయాలి.
అన్ని జిల్లాల్లో పంపిణీ
ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలోనూ అమలు చేస్తున్నట్లు ఉద్వానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. గుంటూరు, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పండ్ల కిట్ల పంపిణీ ప్రారంభమైంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెండింగ్ వ్యాన్ల ద్వారా ఉద్యాన శాఖ సిబ్బంది అపార్ట్మెంట్లు, కాంప్లెక్స్లు, సొసైటీల వద్ద ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సమయంలో విక్రయిస్తున్నారు.