మే 11 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం 

  మే 11 నుంచి  రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.  ఈ మేరకు సచివాలయం నాలుగో బ్లాక్ మొదటి అంతస్థులోని మంత్రి తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మే 11 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. 

లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను  పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్, లా సెట్, పీఈసెట్ తదితర పోటీపరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారు కావడంతో త్వరితగతిన ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యాయరని తెలిపారు. 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.

జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నామని తెలిపారు.దీనికి జోన్-4 కడప జిల్లా ఆర్జేడీ కె.చంద్రశేఖర్ ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారని వెల్లడించారు.

 

Leave a Comment