సౌదీలో కరోనా భయం..

చైనాలో పుట్టిన కోవిడ్-19 ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఒక్క అంటార్కిటికా మినహా ఆరు ఖండాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాదాపు 70 దేశాలకు పాకిన ఈ వైరస్ వేల మందిని బలితీసుకుంది. కరోనా భయంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. అంతకంతకూ వైరస్ పెరుగుతుండటంతో ఆయా దేశాలు కఠిన నిర్ణయాలు తీసకుంటున్నాయి. వైరస్ బారిన పడ్డ దేశాల నుంచి వచ్చే ప్రయాణిలకుపై బ్యాన్ విధించాయి. ఆయా దేశాల విమానాలను కూడా రద్దు చేశాయి. 

హజ్ యాత్రపై కరోనా ప్రభావం..

ప్రస్తుతం కరోనా ప్రభావం హజ్ యాత్రపైనా పడింది. మక్కా మసీదు సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఏటా లక్షల మంది యాత్రికులను ఆకర్షించే సౌదీ అరేబియా విదేశీ పర్యాటకుల వీసాలను రద్దు చేసింది. ప్రపపంచ వ్యాప్తంగా కరోనా పెరగడంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే తమ దేశం వచ్చిన విదేశీయులను తగిన వైద్య పరీక్షల అనంతరం మక్కా సందర్శనకు అనుమతిస్తామని, కోవిడ్ ఉన్న దేశాల యాత్రికులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని సౌదీ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

మదీనా నుంచి మక్కా వరకు సాగే ఈ హజ్ యాత్రను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లింగా పుట్టినందుకు ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర చేయాలనుకుంటారు. మక్కా మసీదు సందర్శనకు ఏటా ప్రపంచ దేశాల నుంచి కొన్ని లక్షల మంది తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యాత్రికులు హజ్ యాత్రకు వెళ్తుంటారు. హజ్ యాత్రకు వెళ్లే పేద ముస్లింలకు ప్రభుత్వాలు కూడా రాయితీలు ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే హజ్ యాత్రకు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు ముస్లింలు. కానీ వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లింది. 

టికెట్లు రద్దు చేసుకుంటున్నారు..

సౌదీ అరేబియా నిర్ణయంతో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు, దాదాపు 5 నుంచి 6 వేల మందిపై ప్రభావం పడుతోందని, టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వారికి మనీ రిఫండ్ చేయడం జరుగుతుందని అన్నారు. మార్చి 13, 14 తేదీల్లో విమానాలు కొనసాగించే అవకాశముందంటున్నారు. 

ఎంతో అద్రుష్టంగా భావించే ఈ యాత్రలో ఒక్కసారిగా సౌదీ ప్రభుత్వం తీసకున్న నిర్ణయం ముస్లింలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ఉద్యోగాల రీత్యా గల్ఫ్ దేశాల్లో ఉంటూ భారత్ కు వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. సెలవుల్లో వచ్చి ఇక్కడ నుంచి సౌదీ వెళ్లడానికి మెడికల్ సర్టిఫికెట్ కంపల్సరీ అనే నిబంధనలతో ఇళ్లకు రావడానికి కూడా ఆందోలన చెందుతున్నారు. చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని అంటున్నారు. 

మొత్తానికి చైనాలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆర్థిక వ్యవస్థపైన పెను ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ఈ మహమ్మారి హజ్ యాత్రపైనా ప్రభావం చూపుతుండటంతో ముస్లింలంతా నిరుత్సాహానికి గురువుతున్నారు. అయితే మక్కా సందర్శనపై ప్రస్తుతం విధించిన నిషేధాన్ని జులై నాటికి ఎత్తివేస్తారా…కొనసాగిస్తారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Leave a Comment