పది పరీక్షల్లో మార్పులు..

ఓఎమ్మార్‌ షీటులో విద్యార్థి ఫొటో

హాల్‌టికెట్‌ నంబరుతోపాటు బార్‌కోడ్‌ కూడా

సబ్జెక్టు, పేపర్ల వారీగా గ్రేడ్లు

అంతర్గత మార్కులకు స్వస్తి

24 పేజీల బుక్‌లెట్లోనే జవాబులు రాయాలి

 అమరావతి : ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో ఇచ్చే ఓఎమ్మార్‌ షీటులో విద్యార్థి ఫొటోను ముద్రిస్తున్నారు. దీనిపై విద్యార్థి హాల్‌టికెట్‌ నంబరుతోపాటు బార్‌కోడ్‌ ఉంటుంది. దీన్ని స్కాన్‌ చేస్తే విద్యార్థి వివరాలు ప్రత్యక్షమవుతాయి. విద్యార్థులు, ఇన్విజిలేెటర్లు కేవలం సంతకాలు చేస్తే సరిపోయేలా దీన్ని రూపొందించారు. పరీక్షకు ఒకరికి బదులు మరొకరు హాజరయ్యే పరిస్థితిని నివారించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. ఈసారి ప్రశ్నపత్రం నుంచి గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు, జవాబుపత్రం, ఇన్విజిలేటర్ల నియామకం వరకు అనేక మార్పులు చేశారు. గతంలో సబ్జెక్టుల వారీగా మాత్రమే గ్రేడ్‌, గ్రేడ్‌ పాయింట్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల వారీగాను గ్రేడ్‌, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. ఈ విధానంతో ఒక విద్యార్థికి ఏ పాఠ్యాంశాలపై పట్టు ఉందో తెలుస్తుంది. రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా సబ్జెక్టు గ్రేడ్‌, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. విద్యార్థి ఉత్తీర్ణత మాత్రం రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. గతంలో ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయులను నియమించగా ఈసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించనున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక సందేహాలతో ఉపాధ్యాయులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ప్రీఫైనల్‌ పరీక్షలు జరుగుతుండగా.. మరో 23 రోజుల్లో పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ముఖ్యమైన మార్పులు..

  •  అంతర్గత మార్కులు 20 శాతం ఈ ఏడాది తొలగించారు. పాఠశాలల్లో జరిగే నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనం మార్కులను ప్రధాన పరీక్షల్లో పరిగణలోకి తీసుకోరు. 100 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • ప్రశ్నాపత్రం గతంలో మాదిరిగా పార్ట్‌-ఏ(ప్రధాన ప్రశ్నాపత్రం), పార్ట్‌-బీ(బిట్‌పేపర్‌)గా ఉండదు. బిట్‌పేపర్‌ తొలగించారు. ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది.
  •  ప్రశ్నాపత్రం నాలుగు విభాగాలుగా ఉంటుంది. లక్ష్యాత్మక ప్రశ్నలు(అబ్జెక్టివ్‌), అతి లఘు ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. హిందీ మినహా ఒక్కో పేపర్‌లో 50 మార్కులు మొత్తం 33 ప్రశ్నలు ఇస్తారు.
  •  కాంపొజిట్‌ కోర్సు మొదటి, రెండో భాష పరీక్షలకు సమయం 3.15గంటలు ఇస్తారు. ప్రశ్నపత్రం చదవడానికి 15నిమిషాలు, పరీక్ష రాయడానికి 3గంటలు ఇస్తారు.
  •  కాపొంజిట్‌ మొదటి భాష రెండో పేపర్‌కు 1.45గంటల సమయం ఉంటుంది.
  • జవాబు పత్రం 24 పేజీలు బుక్‌లెట్‌ ఇస్తారు. అదనంగా ఎలాంటి జవాబు పత్రాలు ఇవ్వరు. మొత్తం ఇందులోనే రాయాల్సి ఉంటుంది.

ఆరో తరగతి నుంచి అంతర్జాలంపై అవగాహన : మంత్రి సురేష్‌

వచ్చే విద్యా సంవత్సరం ఆరో తరగతి నుంచి విద్యార్థులకు అంతర్జాలంపై అవగాహన కల్పించనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అన్ని పాఠశాలలకు అంతర్జాల సదుపాయం కల్పించనున్నామని చెప్పారు. విద్యాశాఖపై సీఎం నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలికసదుపాయాల కల్పనకు నిర్వహిస్తున్న ‘నాడు-నేడు’ కింద 100 కంపెనీలతో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సహాయం చేసేందుకు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయని, ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు రూ.650కోట్లతో జగనన్న విద్యా కానుక అందించనున్నామని, ఒక్కో కిట్‌ రూ.1500 నుంచి రూ.1700 విలువ ఉంటుందని వెల్లడించారు. గోరుముద్ద పథకం వల్ల 80-90శాతం హాజరు పెరిగిందన్నారు.

Leave a Comment