చంద్రబాబు, లోకేష్ లను అరెస్టు చేయాలి – అంబటి

తాడేపల్లి : ఐటీ దాడులలో ప్రాథమిక సాక్ష్యాలు దొరికాయి కాబట్టి చంద్రబాబు, లోకేష్ లను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై దాడులు జరిగితే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయంటే..చంద్రబాబు, లోకేష్ లను విచారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయోనని ప్రశ్నించారు.  చంద్రబాబు సన్నిహితులపై ఐటి దాడులలో కీలక ఆధారాలు లభించాయన్నారు. తన సన్నిహితులపై ఐటి దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఐటి, ఈడి రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద కీలక ఆధారాలు సేకరించారన్నారు. చంద్రబాబు పాపం పండిందని, వ్యవస్దలను మేనేజ్ చేయడానికే హైదరాబాద్ వెళ్లారని చెప్పారు. చంద్రబాబు,లోకేష్ లు హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారన్నారు. దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు, లోకేష్ లు నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు.  ఇన్నాళ్లు కోర్టులను, వ్యవస్దలను మేనేజ్ చేస్తూ వచ్చారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. గతంలో కేంద్రంపై యుధ్దం చేస్తున్నట్లు ఘీంకారాలు పలికారన్నారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లపై ఐటి దాడులు జరిగితే …ఈ దాడులపై ఎల్లో మీడియా మాత్రం వార్తలు రాయడం లేదన్నారు. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ పై కూడా ఐటి దాడులు జరిగాయన్నారు. ఐటి సోదాలపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్యాకేజీలు తీసుకుని రాజకీయం చేస్తారా..వీళ్లా ప్రజలను ఉద్ధరించేది అని మండిపడ్డారు. సీపీఐ రామకృష్ణకు ఏ తేలు కుట్టిందో అని ఎద్దేవ చేశారు. నిత్యం నీతి వాక్యాలు మాట్లాడే పవన్ కల్యాణ్ ,రామకృష్ణలు ఏమయ్యారని ప్రశ్నించారు. 

Leave a Comment